సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: టీజీ వెంకటేశ్‌

సాక్షి, కర్నూలు: కర్నూలును న్యాయరాజధానిగా ఏర్పాటు చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి బీజేపీ నేత, ఎంపీ టీజీ వెంకటేశ్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో సీఎం జగన్‌, ఎంపీ టీజీ వెంకటేశ్‌ల మధ్య అసక్తికర చర్చ జరిగింది. తమకు రావాల్సిన హైకోర్టు ఎంతవరకు వచ్చిందని సీఎంను ఎంపీ కోరగా.. హైకోర్టు కర్నూలులో ఏర్పాటుకు కేంద్రం అనుమతి కోరామని, నివేదిక కూడా పంపించామని సీఎం జగన్‌ వివరించారు. రాయలసీమ డిక్లరేషన్‌లో, బీజేపీ మేనిఫెస్టోలో హైకోర్టు అంశం ఉండటంతో కేంద్రం నుంచి త్వరలోనే సానుకూల ప్రకటన రావచ్చని సీఎం జగన్‌తో ఎంపీ టీజీ వెంకటేశ్ పేర్కొన్నారు. 

కర్నూలులోని దిన్నెదేవరపాడులో జరిగిన పత్తికొండ ఎమ్మెల్యే కె.శ్రీదేవి కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్‌ హాజరై నూతన వధూవరూలను ఆశీర్వదించారు. ఈ వేడుకకు హాజరయ్యేందుకు గురువారం ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం చేరుకుని అక్కడి నుంచి ఓర్వకల్లు విమానశ్రయానికి సీఎం జగన్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఓర్వకల్లు విమానశ్రయంలో సీఎం జగన్‌కు ఎంపీ టీజీ వెంకటేశ్‌తో పాటు స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం జగన్‌తో టీజీ వెంకటేశ్‌ కాసేపు ముచ్చటించారు.